Sunday, June 29, 2025

ప్రజాస్వామ్య  “ భారతంలో  బీసీల స్థానం – ఒక చరిత్రాత్మక మోసం ” ?

డా. కేశవులు భాషవత్తిని. ఎం.డి. (సైకియాట్రీ).
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
             

భారతదేశ రాజ్యాంగం “సమానత్వం” అనే పదాన్ని గర్వంగా పలుకుతుందిగానీ, వ్యవస్థ మాత్రం అది వాస్తవంగా ఎలా అందించాలో ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. దేశం జనాభాలో 52 శాతం పైగా ఉన్న బీసీ వర్గానికి ఇప్పటికీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సీబీఐ డైరెక్టర్, లేదా RBI గవర్నర్ పదవులు ఎందుకు దక్కలేదు? ఎందుకు ఆర్థిక, విద్యా, న్యాయ రంగాల్లో బీసీలు అణచివేతకు గురవుతున్నారు? ఇది కేవలం అపవాదం కాదు – ఇది వ్యూహాత్మకంగా centuries పాటు కొనసాగుతున్న అణచివేత వ్యవస్థ. బీసీ అనేది ఓ మానవగౌరవాన్ని కోల్పోయిన వర్గం కాదు – అది గౌరవాన్ని ఎప్పటికీ పొందకుండా ఉంచేలా రూపొందించబడిన వ్యవస్థల బాధిత వర్గం.

చరిత్రలోని శోషణ –  శూద్రుని శాపధ్వని :

వేదకాలంలో ‘శ్రేణీకరణ’ అనే పేరు పెట్టి శూద్రులకు విద్యను, ధనాన్ని, అధికారాన్ని దూరం చేశారు. బీసీలను  శారీరక శ్రమ వర్గంగా చూసి, జ్ఞానాధికారాన్ని దూరంగా ఉంచారు.బ్రిటిష్‌ కాలంలోనూ జమీందారీ వ్యవస్థ, మిషనరీ విద్యా సంస్థల ప్రాప్యత వర్గ ఆధారంగా బీసీలకు భూమి యాజమాన్యం, విద్యా అవకాశాలు, ప్రభుత్వ పదవులు దక్కే అవకాశం లేదు. 1947లో స్వాతంత్రం వచ్చినా, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినట్టు ప్రకటించినా, ఆ హక్కులు ఎవరి చేతుల్లో ఉన్నాయో పరిశీలించండి.75 ఏళ్ల తర్వాత కూడా బీసీలు సామాజికంగా ద్వితీయ పౌరులుగా మిగిలిపోయారు.

ఐఏఎస్ లలో బీసీ ప్రాతినిధ్యం <15%
హైకోర్ట్, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల్లో <5%
2024 నాటికి లోక్‌సభలో బీసీ ఎంపీలు కేవలం 90-110 మాత్రమే (543కి ) 
ఇది యాదృచ్ఛికత కాదు – ఇది శతాబ్దాలుగా రూపొందించబడిన వ్యవస్థ. ఇది “అనుభవాన్ని కలిగి ఉండాలి” అనే దాగిన అస్త్రంతో బీసీల ఎదుగుదలను నిరోధించే పద్ధతి.
బీసీలు ఏ రంగంలోనూ – వ్యవసాయం, పరిశ్రమ, సాంకేతిక రంగం, బ్యాంకింగ్, మీడియా – ఏదిలోనూ శాతం మేర కూడా భాగస్వాములు కాలేకపోయారు. కారణం? పెట్టుబడి శూన్యత…

మీడియాలో బీసీ శబ్దం లేదు :

ఈ దేశంలో మీడియా ఒక వర్గం చేతుల్లో ఉంది.  జర్నలిజం చదువుతున్న విద్యార్థుల్లో పెద్దశాతం బీసీలే ఉన్నా, వ్యవస్థ మాత్రం వారిని Decision Making స్థాయికి తీసుకురాదు. మీడియా బహుజనులను ప్రతిబింబించదు. ముఖ్యమైన న్యూస్ రూమ్ ఎడిటింగ్ బోర్డుల్లో, ఛానెల్ డిసిషన్ మేకింగ్ స్థాయిలో బీసీల ప్రభావం కనీసంగా లేదు. ఇదే కారణంగా, బీసీ వ్యాపారులు, యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అసమానతలు అసలు వార్తలవ్వవు.ఇది విధాన బాహ్యత కాదు – ఇది వ్యవస్థాపిత మౌన దురాచారం.
ఇది కేవలం ప్రాతినిధ్యం లేమి కాదు – ఇది Amplification లేకపోవడం. ప్రజాస్వామ్యంలో మూల స్వరం వినిపించకపోతే, అది ప్రజల రాజ్యం కాదు .

విభజించి పాలించు – ఒక నిరంతర వ్యూహం :

విభజించు – పాలించు’ అనే రాజకీయ వ్యూహం లో పెద్ద పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. కానీ అధికారం ఇచ్చే స్థాయిలో ప్రాతినిధ్యం మాత్రం ఇవ్వడం లేదు. బీసీ అనేది ఒకే కులం కాదు , ఏకీకృత వర్గం కాదు . దాదాపు 2000 కులాల సమాహారం. రాజకీయ పార్టీలు దీన్ని వ్యూహంగా మలిచి, చిన్న కులాలను విభజించి, ఓటు బ్యాంకులుగా వాడుకుని, మెజారిటీ ఓట్లను సంపాదించి, అధికారం మాత్రం సమర్థుల పేరుతో మరొక వర్గానికి కేటాయించాయి.

వాస్తవ ఉదాహరణలు:

తెలంగాణలో బీసీలు 56% పైగా ఉన్నా, ఒక్కసారి కూడా సీఎం పదవి దక్కలేదు.
ఏ పార్టీ అయినా, బీసీలను పై పదవుల్లో పెట్టే దమ్ము చూపలేదు.
పార్టీ అధ్యక్ష పదవి, ఎన్నికల స్టాటర్జీ, మీడియా బాధ్యతలు – అన్నీ ఇతర వర్గాల చేతుల్లోనే.
ఇది Representation without Power. Amplification without Voice.

ఆర్థిక  మద్దతు ఎక్కడ ? 

బీసీలు రాజకీయంగా ఎదగాలంటే ముందుగా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే, పెట్టుబడి, అవగాహన, మెంటరింగ్, మార్కెట్ యాక్సెస్, నిబంధనల సరళీకరణ అవసరం.
@  BC Bandhu లాంటి ప్రత్యేక పెట్టుబడి పథకాలు – అన్ని జిల్లాల్లో అమలు
@  BC Economic Representation Mapping Act – ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో శాతం నిర్దేశించాలి
@  బీసీ-specific Entrepreneur Hubs – Mentorship, MSME linkage, Export guidance
@  బహుజన మీడియా నిర్మాణం – YouTube, Podcast, App News పోర్టల్స్ ద్వారా స్వరాన్ని వినిపించాలి.
@   దేశ కులగణన పూర్తి చేసి, అధికారికంగా ప్రజల ముందుంచాలి – రాజకీయ ఆర్ధిక అసమానతల చుట్టూ చర్చ పెరగాలి,

 మూలస్తంభాల అభివృద్ధి పునర్నిర్మాణం :

ఈ దేశం ఒక వర్గానికి మాత్రమే రాజ్యాధికారాన్ని కల్పించాలంటే, అది ప్రజాస్వామ్యం కాదు.బీసీలు ఓటేస్తున్నారు – కానీ అధికారం పొందలేకపోతున్నారు. ఓట్ల బలం ఉన్నా, ఆర్థిక బలం లేని BC వర్గాలు కేవలం గణాంకాలుగా మిగిలిపోతున్నాయి. SC, ST, OBC, ముస్లిం ఓట్లు కలిపితే – 70% పైగా ఓటింగ్ శక్తి. ఓట్ల బలం ఉన్నా, ఆర్థిక శక్తి లేకపోతే అది దాస్యానికి ద్వారం. ప్రతీ బీసీ యువకుడు, యువతి, విద్యార్థి – ఇది గుర్తుంచుకోవాలి. Representation లేకపోతే, సమానత్వం అనేది ఖాళీ నినాదమే.బీసీలకు ఈ దేశంలో పూర్తి రాజ్యాధికారం రావాలంటే , ఈ వర్గాల ఐక్యత ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ఉద్యమం అవసరం.విద్య, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక రంగాల్లో ఒకటిగా నడవాల్సిన అవసరం.ఈ అసమానత తొలగాలంటే, బహుజన ఐక్యత, ఆర్థిక వ్యవస్థలో ప్రాతినిధ్యం, పెట్టుబడి సామర్థ్యం, విద్యా ప్రాధాన్యత – ఈ నాలుగు మూలస్తంభాలపై అభివృద్ధి  పునర్నిర్మాణం అవసరం – న్యాయమైన, సమానమైన, బహుజన ప్రాతినిధ్యాన్ని కలిగిన భారత రాజ్యంగా భారత్ మారాలంటే… ఆర్థిక బలం లేని రాజ్యాధికారం అనేది ఎప్పటికీ ఒక మాయాజాలమే !  ఒక నూతన ఉద్యమం అవసరం. అది కేవలం గళం పెట్టిన ఉద్యమం కాదు – అది ఆర్థిక శక్తితో కూడిన, విద్యతో నిర్మితమైన, మౌలిక హక్కుల పునర్నిర్మాణ ఉద్యమం  ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారంలో స్థానమివ్వకపోతే, ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img