Monday, June 30, 2025

సి ఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుల బ్రేకులకు అసలు కారణం ఎవరో తెలుసా ?

Dr Keshavulu MD psy Osm. Chairman : Telangana intellectuals Association

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కొత్త దిశల్ని సూచిస్తూ అనేక ప్రాజెక్టులు ప్రకటించింది. అయితే, ఆ ప్రాజెక్టుల అమలులో అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. ప్రజా ప్రతినిధిగా మంచి దూకుడు, స్పష్టత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్, ముఖ్యమంత్రిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా, వాటి అమలులో పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రుణమాఫీ మొదలు నేటి హెచ్ సి యూ భూ వివాదం వరకు కూడ తన పేరు ప్రతిష్టల కంటే భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం మాత్రమేనని ధైర్యంగా ముందు కెళ్ళుతున్నాడు. అత్యంత ప్రతిష్టకరంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నప్పటికీ, ప్రాజెక్టుల పరిధిలో గల ప్రజల ను మెప్పించలేకపోవడం బాధాకరం, ఇందుకు కారణం…. సరైన రీతిలో ఒప్పించి, మెప్పించే అధికారుల వైఫల్యము తో పాటు సోషల్ మీడియా దుష్ప్రచారం కూడ కారణం ……

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమని భావిస్తున్న నాలుగు ప్రాజెక్టులకూ ఏదోరూపంలో బ్రేకులుపడినా విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) ప్రాంగణంలో ఉన్న 400 ఎకరాలను వేలంద్వారా అమ్మాలన్న రేవంత్ నిర్ణయంపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. ఇంతకముందు మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు(Musi River Project)కు కూడా కోర్టులో కేసుల వల్లే బ్రేకులుపడింది. ఇపుడా ప్రాజెక్టు పరిస్ధితి ఏమిటో ఎవరు చెప్పలేకున్నారు. పేదల ఇళ్ళను కూలుస్తున్న హైడ్రా, పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలపై ఎందుకు స్పందించదు?” అని హైకోర్టు ప్రశ్నించడంతో స్పీడ్ తగ్గి పోయింది, అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటి(Pharma City)కి సేకరించాలని అనుకున్న భూసేకరణ కూడా వివాదాస్పదం అవటంతో నిలిచిపోయింది. ఈ నాలుగు ప్రాజెక్టులను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఆ నాలుగు ప్రాజెక్టుల పరిస్ధితి అయోమయంగానే తయారైంది.

  1. కొడంగల్ ఫార్మాసిటీ ప్రాజెక్టు –

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్‌లో ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం మూడు గ్రామాల్లో సుమారు 1100 ఎకరాల భూమిని సేకరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. భూసేకరణ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్థులు, రైతులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనకుండా, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా నోటిఫికేషన్ జారీ చేయడం ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టింది. రైతులతో ముందస్తు చర్చలు లేకపోవడం, భూహస్తాంతరణకు న్యాయమైన పరిహార ప్యాకేజీని వివరించకపోవడం వల్ల ఈ వివాదం తారాస్థాయికి చేరింది. హైకోర్టు మధ్యవర్తిత్వంతో భూసేకరణపై తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

  1. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు –

రెవంత్ ప్రభుత్వం చేపట్టిన మరో ముఖ్యమైన ప్రాజెక్టు మూసీ నది అభివృద్ధి. 57 కిలోమీటర్ల పొడవునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను, ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో 250 ఇళ్లను కూల్చివేయగా, నివాసితులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు వెంటనే రంగంలోకి దిగడంతో ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ఇక్కడ ప్రభుత్వ దొర్లిన ప్రధాన లోపం — ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను సరైన రీతిలో వివరించకపోవడం. హైకోర్టు ప్రభుత్వం చర్యలపై గట్టిగా స్పందించి కూల్చివేతలకు స్టే ఇచ్చింది. నివాసితులతో చర్చలు జరిపి తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అంగీకరించిన వారు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయినట్లైంది.

  1. హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత –

హైద్రాబాద్‌లో హైడ్రా (HMDA) అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను వేగంగా చేపట్టారు. అయితే, నోటీసులు జారీ చేసిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేయడం, చిన్నచిన్న పేదల ఇళ్లపై దృష్టి పెట్టడం, భారీ అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టడం హైకోర్టు దృష్టిలో పడింది. “ పేదల ఇళ్ళను కూలుస్తున్న హైడ్రా, పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలపై ఎందుకు స్పందించదు?” అని హైకోర్టు ప్రశ్నించడంతో హైడ్రా చర్యలపై నమ్మకహీనత ఏర్పడింది. దీని ప్రభావంగా కూల్చివేతలు తగ్గిపోయాయి.

  1. హెచ్ సి యూ భూ వివాదం –

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సుమారు 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేసింది. కానీ దశాబ్దాలుగా ఆ భూమిని యూనివర్సిటీ పరిధిగా భావిస్తూ వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు దీనిపై తీవ్రంగా స్పందించారు. భూముల్లో వేలాది చెట్లు, పక్షి–జంతు జాలం ఉన్న నేపథ్యంలో పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి ముందుగానే సంబంధిత వర్గాలతో చర్చలు జరిపే అవకాశం ఉండేది. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పర్యావరణ నష్టం కాకుండా అభివృద్ధి ఎలా సాధ్యమో విశ్లేషించి ముందుకు వెళ్లాల్సింది. కానీ తొందరపాటు నిర్ణయాలతో వివాదం కోర్టు వరకు వెళ్లి, అక్కడ నుంచి కఠిన వ్యాఖ్యలే ఎదురయ్యాయి.

ప్రతిపక్షాల వ్యూహం –

ప్రతిపక్షాలు — ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ — ఇవన్నీ ప్రభుత్వ పాలన వైఫల్యాలుగా చూపిస్తూ ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి వల్ల రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అయితే, అసలు సమస్య ఏంటంటే — ఆందోళనలకు కారణాలు ప్రభుత్వం వల్లే కలుగుతున్నాయన్నది గమనించాలి. ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వకుండా, సంప్రదింపులు లేకుండా తీసుకునే నిర్ణయాలే ఈ సమస్యల మూలం.

ప్రజా భాగస్వామ్యంతోనే ….

” అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదు. అది ప్రజల జీవనవిధానాన్ని మెరుగుపర్చే ప్రక్రియ. ప్రజల అభిప్రాయాలు, భావోద్వేగాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయమూ సుస్థిరంగా ఉండదు. పాలకులు జాగ్రత్తగా, పరిజ్ఞానంతో, ప్రజలతో సలహాలు–సూచనలతో ముందుకు సాగితే మాత్రమే అభివృద్ధి యథార్థంగా ఫలిస్తుంది. ప్రతి అభివృద్ధి ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటేనే పాలన విజయవంతమవుతుంది. లేకపోతే, అధికారం ఉన్నా అభివృద్ధికి ఎప్పుడూ బ్రేకులే !

డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img