వర్షకాలంలో కరోనా తుఫాన్.! మళ్లీ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 866. సైంటిస్టులు సైతం ఊహించని దూకుడు అది. భయపెట్టడానికి చెబుతుంది కాదిది. ప్రస్తుతం డేటా ఇస్తున్న వార్నింగ్.
కరోనాను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కన్పిస్తోంది. ప్రస్తుతం కేరళలో పాజిటివ్ కేసులు 1500 దగ్గరలో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కో రాష్ట్రంలో 500పైగా కేసులు నమోదయ్యాయి. కర్నాటక, తమిళనాడులోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయంగా కనిపించటం లేదని.. ప్రభుత్వ లెక్కలతోనే తెలుస్తోంది. పరీక్షలు చేయించుకోని వారు ఇంకెంత మంది ఉన్నారో.. జలుబు, దగ్గు, జ్వరంగా మామూలే కదా అంటూ ట్యాబ్లెట్లు వాడుతున్న వారు ఇంకెంత మంది ఉన్నారో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.