Thursday, June 26, 2025

బనక చర్ల ప్రాజెక్టు —   శాపం ఎవరికి ?వరం ఎవరికి ! 

డాక్టర్. కేశవులు భాషవత్తిని. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659. 

నీళ్లు, నిధులు, నియామకాలు కోసం. ఎన్నో త్యాగాలు, వేలమంది యువకుల ప్రాణ త్యాగాలతో వచ్చిన రాష్ట్రం. కానీ రాష్ట్ర ఏర్పాటయ్యాక సరిగ్గా పది ఏళ్లకే మళ్లీ అదే నీటి కోసం తెలంగాణ  ప్రజల గుండె వెచ్చవుతోంది. గోదావరి తీరంలోని వాడే కాదు, హైదరాబాద్‌లో నీళ్లు తాగే చిన్నారి వరకూ… ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న — “మా గోదావరి నీళ్ళు ఎక్కడ ? బనక చర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో గోదావరి మీద ఆధిక్యత గల్లంతవుతుంది. వరద నీళ్లే కాదు, భవిష్యత్తులో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా పోతుంది. ఇది కేవలం ఒక నీటి ప్రాజెక్టు కాదు, తెలంగాణ భవిష్యత్ సాగుకు చిరకాల గాయం. 

బనక చర్ల ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు లో భాగంగా ఉంది.  బనకచర్ల అనేది కేవలం ఓ హెడ్ రెగ్యులేటర్ పేరు కాదు. ఇది గోదావరి నీటిని దోచుకునేందుకు రూపొందించిన ఓ రాష్ట్ర వ్యూహం. గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా బొల్లపల్లి రిజర్వాయర్‌కి తరలించి, అక్కడినుంచి బనక చర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకి మళ్లించడం ద్వారా అక్కడి కరువు సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు ₹ 80,112 కోట్లు, నీటి మళ్లింపు, గోదావరి నదిలోని 200 టీ ఎం సీ ఎఫ్‌ టీ (TMCFT) వరద నీటిని పోలవరం ప్రాజెక్టు నుండి బొల్లపల్లి రిజర్వాయర్‌ ద్వారా బనక చర్ల హెడ్ రెగ్యులేటర్‌కు మళ్లించడం. ప్రాజెక్టు  కోసం సుమారు 54,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది.  ప్రాజెక్టు అమలుకు సుమారు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ అవసరాలను తీర్చేందుకు బొల్లపల్లి, సిద్ధాపురం, గుట్టికొండ ప్రాంతాల్లో పంప్‌డ్ స్టోరేజ్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల అభివృద్ధి :  ప్రాజెక్టు ద్వారా డోనకొండ లోని మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 2.58 టీఎంసీ నీటిని, అలాగే ప్రకాశం జిల్లాలోని పామూరు మరియు పెదచెర్లపల్లె మండలాల్లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (NIMZ)కు 1.27 టీఎంసీ నీటిని అందించడం లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నాలుగు సంవత్సరాల్లో, మూడు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించడం, రెండో దశలో బొల్లపల్లి రిజర్వాయర్‌ను నిర్మించడం,  మూడో దశలో బొల్లపల్లి నుండి బనక చర్ల వరకు నీటిని తరలించడం, ఇందు కోసం  ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక సంస్థగా “జల హారతి కార్పొరేషన్”ను ఏర్పాటు చేసింది.  ప్రాజెక్టుకు కేంద్ర సహాయం కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదికలు సమర్పించింది. ఈ ప్రాజెక్టు అమలుతో రాయలసీమ ప్రాంతంలో కరువు సమస్యలు తగ్గి, వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.  అయితే, ప్రాజెక్టు సంబంధిత వివాదాలు మరియు అనుమతుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 

రాజకీయ  కోణమా ? 

ఈ ప్రాజెక్టు వెనుక రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమలో రాజకీయంగా శక్తిని పెంచుకోవడం, రాష్ట్ర హక్కులను విస్మరించి, కేంద్ర జల సంస్థల అనుమతులు లేకుండా ముందుకు పోవడం ఒకతరఫు. మరోవైపు తెలంగాణ రాజకీయ నాయకుల మౌనం, తాత్సారం కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహమే. ఒకవైపు RDS, NSP నీళ్ల విషయంలో పోరాడకుండానే, మరోవైపు గోదావరి నీళ్ల విషయంలో కూడా  మౌనం , తెలంగాణ ప్రజల గుండెల్లో మళ్లీ పాత  గాయాలను తెరుస్తోంది. సాంప్రదాయంగా గోదావరి నీటి 75% హక్కు తెలంగాణది. ఈ నీరు తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తుండగా, ఇతర రాష్ట్రాలకు మళ్లించాలంటే GRMB, CWC, Apex Council అనుమతులు తప్పనిసరి. కానీ ఆ అనుమతులు లేకుండానే బనక చర్ల పనులు జరిగిపోవడం తెలంగాణ పై నిర్వహణ వైఫల్యం, రాజకీయ నిస్సహాయతకు నిదర్శనం.

తెలంగాణకు అన్యాయం : 

ఈ ప్రాజెక్టు వల్ల జరగబోయే ప్రాథమిక అన్యాయాలను పరిశీలిస్తే , గోదావరి బేసిన్‌లో మూడింట రెండు భాగాలు తెలంగాణలో ఉండగానే, నీళ్లు బయటకు తరలించడం అన్యాయం.శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుంది. తెలంగాణలో ఇప్పటికే వరద కాలం తక్కువగా ఉండగా, దీనివల్ల సాగునీరు మరింత తీవ్రంగా కొరత పడి, రైతులు అప్పుల ఊబి లో చిక్కు కుంటారు.గోదావరి నది ఆధారిత జిల్లాలైన మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, వరంగల్ ప్రాంతాలకు నీటి సరఫరా ప్రమాదంలో పడుతుంది. ఒకసారి పై నుండి నీటిని మళ్లిస్తే, దానిని తిరిగి తీసుకోవడం రాజ్యాంగ పరంగా కూడా కష్టం. భవిష్యత్తులో  తెలంగాణ ప్రాజెక్టులకు గోదావరి నీటిని అడిగే హక్కు కూడా కష్టమవుతుంది. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే అన్యాయం జరుగుతుంటే, గోదావరి నీళ్లను కూడా తీసుకుంటే తెలంగాణ భవిష్యత్ ఏంటి ? నీటి కొరతతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ, మళ్లీ పంటల నష్టాలు, వ్యవసాయ కూలీల వలసలు పెరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం సరైన పోరాటం చేయకపోతే, భవిష్యత్తులో పుట్టే పిల్లలు కూడా తాగడానికి బావి నీళ్లు దొరకకుండా పోతుంది.

ఉద్యమం తప్పదా ? 

బనకచర్ల ప్రాజెక్టు అనేది కేవలం నీటి అంశం కాదు. ఇది తెలంగాణ జీవన స్థితిగతులపై రాజకీయ దాడి.ఈ ప్రాజెక్టు అమలుపై తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతులు, యువత ఒక్కటిగా నిలబడాలి. ‘గోదావరి మా వంతు నీళ్లు తెలంగాణ  ప్రజల హక్కు’ అని గొంతెత్తాలి.ఈ ప్రాజెక్టు కేంద్ర జలశక్తి శాఖ, CWC, GRMB, KRMB నుంచి అనుమతులు లేకుండా, వాస్తవంగా గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించి, దొంగతనం చేస్తున్న ప్రాజెక్టు. ఇది పాలన వ్యవస్థల మౌనం, రాజ్యాంగ ఉల్లంఘన.

ఇది ఓ రాజకీయ వివాదం కాదు. ఇది జీవనప్రశ్న,  కాళేశ్వరం కడలివేళ్లలోకి పోయినా, బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లను తరలిస్తే — తెలంగాణ పంటలు, జీవితాలు ఎండిపోతాయి. నీటి కోసం ఉద్యమించిన తెలంగాణ… మళ్లీ నీటి కోసమే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.తెలంగాణ ఉద్యమంలో గోదావరి తీరంలో వేలమంది యువకులు, రైతులు “మా నీళ్లు మా వంటిల్లు దాటి పోకూడదు” అని ప్రాణాలిచ్చారు. ఇప్పుడు అదే గోదావరి నీటిని ఎత్తిపోసి, తెలంగాణ గుండెని ఎండబెట్టడాన్ని చూస్తూ ఊరుకుంటే… అది మన అమరవీరుల త్యాగానికి విరుద్ధం. ఈసారి మళ్లీ ఉద్యమం అవసరం. లేదంటే  రేపటి  తెలంగాణ ఎండిపోయిన ఎడారి భూమిగానే  మిగిలిపోతుంది.

 

ఈ ప్రాజెక్టు ఆపితే  తెలంగాణకు భవిష్యత్. 
 ఈ ప్రాజెక్టు  కట్టితే  తెలంగాణకు బారీ నష్టం.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img