పాకిస్తాన్ అంటే మనకు శత్రువు అని తెలిసినదే. అది మన దేశంపై ఉగ్రదాడులు చేస్తుంది, మన శాంతికి భంగం కలిగిస్తుంది. అందుకే దాన్ని ఎదుర్కోవడం అవసరం. కానీ పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైన శత్రువు ఇంకొకరు ఉన్నారు – వాళ్లు మన దేశంలోనే ఉన్నారు. వాళ్లే “ఇంటి దొంగలు”.
ఈ ఇంటి దొంగలు ఎవరో కాదు – అవినీతి చేసే రాజకీయ నాయకులు, ప్రజల పన్నుల డబ్బును దోచుకునే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లు , నకిలీ వస్తువులు అమ్మే వ్యాపారులు, డొనేషన్ల పేరుతో విద్యను, వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన సంస్థలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఒడిగడుతూ , మన జవాన్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అలాంటి దేశాన్ని, ఆ ఉగ్రవాద చర్యలను పొగడటం – అది స్వేచ్ఛ కాదు, అది స్పష్టమైన దేశద్రోహమే. అటువంటి వారిని సమాజం క్షమించకూడదు. చట్టం బలంగా వ్యవహరించాలి.
పాకిస్తాన్ మన దేశాన్ని బాహ్యంగా దెబ్బతీస్తే, ఇంటి దొంగలు లోపలినుంచి నాశనం చేస్తున్నారు. హాస్పిటల్కి మందులుండవు, స్కూల్కి గురువులుండరు, కానీ పెద్దల కోసం భారీ కార్లు, భద్రతలు ఉంటాయి. ఇదంతా దేశాన్ని కుంగదీస్తోంది.భారత దేశం ఓ తల్లి. ఆ తల్లిని అవమానించే వారిని క్షమించడం ద్రోహం. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని చిత్తశుద్ధితో ప్రేమించాలి. భావోద్వేగంతో కాదు, బాధ్యతతో.
అందుకే, నిజమైన జాతీయత అంటే ఒక వర్గం వారికి మద్దతుగా మాట్లాడి, వేరే వర్గం వారికి అన్యాయం జరిగినప్పుడు కనీసం స్పందించకపోవడం కూడ కాదు. పరాయి దేశాలను నిందించడం కంటే ముందూ – మన ఇంటి దొంగలను పట్టుకోవడం, దేశ వ్యవస్థలను శుద్ధి చేయాలి. అప్పుడే మనం బాహ్య శత్రువుని నిజంగా ఎదుర్కొనగలం.ఎవరు దేశ శత్రువులకు సహకరిస్తే – వారిపై UAPA లాంటి చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ముందు ఇంటి దొంగలను మట్టుబెట్టి, దేశాన్ని రక్షించుదాం !
డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.