– రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ రచించిన ” ఓ తండ్రి తీర్పు ” లఘు చిత్రానికి పిన్ టీవీ పురస్కారం వరించింది..
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత, విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన "ఓ తండ్రి తీర్పు" లఘు చిత్రానికి హైదరాబాద్ నగరానికి చెందిన పిన్ టీవీ సంస్థ నిర్వహించిన లఘు చిత్ర పోటీలలో పాల్గొని ప్రశంసా పత్రాన్ని గెలుచుకొన్నది. శ్రీ రామదూత ఫిల్మ్ మేకర్స్ పతాకం పై చిట్టా రాజేశ్వరరావు, చిట్టా అపూర్వ లు నిర్మించగా ఇట్టి చిత్రానికి ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకొన్న గాధంశెట్టి ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారు. అంతర్జాల విపణి నుండి పలు ఒ.టి.టి ఏజెన్సీ ప్లాట్ ఫార్మ్ ల ద్వారా ప్రేక్షకులు వీక్షిస్తున్న ఈ చిత్రానికి గతంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ( ఐ. ఎఫ్. ఎం. ఎ ) వారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకున్నది. సమాజంలోని అనేక కుటుంబాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇతివృత్తంగా తీసుకొన్న కథా నేపథ్యంతో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన తనయులైన యువత తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని యువత నందు మార్పు దిశగా ఈ చిత్రం నిర్మించబడినదని, పలువురు సాహితీ రచయితలు, సంపాదకులు పత్రికాముఖంగా సమీక్షలు తెలియజేశారని చిత్ర కథా రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ తెలిపారు. వరుసగా పురస్కారాలు అందించిన నిర్వాహక సంస్థలకు, జూరీగా వ్యవహరించిన న్యాయ నిర్నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.