ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఓ వ్యక్తి రాయి విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. తెనాలిలో వారాహి విజయభేరి యాత్రలో పవన్ పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలోనే ఆయనపై రాయి విసిరారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో పవన్కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్కు దూరంగా వెళ్లిపడింది. దీంతో జనసేనానికి ఎలాంటి గాయం కాలేదు.మరోవైపు రాయి విసిరిన ఆగంతకుణ్ని జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే వారాహి యాత్రలో జరిగిన ఘటన పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెట్టింది. రాయి విసిరిన వ్యక్తి ఎవరు.. ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాయి కనుక తగిలి ఉంటే పవన్ కళ్యాణ్ గాయపడేవారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జనసేనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.